ఐసీయూ ఘోరం..మూడు రోజుల శిశువు ప్రాణం తీసిన చీమలు

మూడు రోజుల శిశువును చీమలు కుట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆ మధ్య తెలంగాణలో వరంగల్ MGM హాస్పటల్ లో కూడా చికిత్స తీసుకుంటున్న వ్యక్తిని ఎలుకలు కొరికి చంపేసిన ఘటన వైరల్ గా కాగా..ఇప్పుడు అదే తరహాలో కాకపోతే అక్కడ ఎలుకలు, ఇక్కడ చీమలు కొరికి చంపేశాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..మహోబా జిల్లా కుల్పహర్ తహసీల్ ప్రాంతంలోని ముధారి గ్రామానికి చెందిన సురేంద్ర రైక్వార్ భార్య సీమ గర్భిణీ. ఆమెకు గర్భస్రావం కావడంతో మే 30వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆమెకు పండంటి చిన్నారి పుట్టింది. అస్వస్థత కారణంగా పాపను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చికిత్స ఇస్తున్నారు. ఈ క్రమంలో శిశువును చీమలు కుట్టడంతో జూన్ 2వ తేదీన చిన్నారి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల చిన్నారి మృతి చెందినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. అలాగే చికిత్స సమయంలో డాక్టర్ రూ.6,500 లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.