రెజ్లర్లతో అమిత్‌ షా భేటి..చట్టం అందరికీ సమానమేనని తేల్చిచెప్పిన హోంమంత్రి

బజ్ రంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్ హాజరు

Let Law Take Its Course, Amit Shah Told Wrestlers In Late-Night Meet

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో కేంద్ర హోంమంత్రి శనివారం అర్ధరాత్రి భేటీ అయ్యారు. తాజాగా ఈ విషయాన్ని ఆందోళన చేస్తున్న రెజ్లర్లలో ఒకరైన బజ్ రంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు. రాత్రి 11 గంటలకు మొదలైన ఈ సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగిందని చెప్పారు. భేటీలో తనతో పాటు సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియన్ పాల్గొన్నట్లు పూనియా వివరించారు. అయితే, ఈ భేటీకి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పూనియా నిరాకరించారు.

అనధికారిక సమాచారం మేరకు.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, లైంగిక వేధింపుల కేసులో వేగంగా చర్యలు తీసుకోవాలని ఈ భేటీలో కేంద్ర హోంమంత్రిని రెజ్లర్లు కోరారు. పలు జాతీయ మీడియాలలో ఈమేరకు కథనాలు ప్రసారమయ్యాయి. చట్టం అందరికీ సమానమేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని అమిత్ షా రెజ్లర్లకు సూచించినట్లు సమాచారం.