ప‌ద్మాల‌యా స్టూడియోలో కృష్ణ పార్థివ దేహం.. కడసారి చూసేందుకు తీరిన అభిమానులు

సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని ప‌ద్మాల‌యా స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఉదయం నుండి తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు అభిమానులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది అభిమానులు చేరుకొన్నారు. ఓ గొప్ప నటులను కోల్పాయామని వారంతా బాధపడుతున్నారు. మధ్యాహ్నం పద్మాలయ స్టూడియో నుండి అంతిమ యాత్ర కొనసాగనుంది. 3 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు జరగనున్నాయి.

గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు.

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. అది చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వచ్చేశారు. 1965లో ఆయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.