బంగ్లాదేశ్ ప్రధాని తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..బుధువారం బంగ్లాదేశ్ ప్రధాని శ్రీమతి షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈశాన్య భారతం-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకోవడం ద్వారా ఇరుదేశాల్లో వివిధ అంశాల్లో సానుకూల ఫలితాలకు ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు.

బార్డర్ హాట్స్, ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్స్, ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యల ద్వారా సరిహద్దు వాణిజ్యానికి మరింత ఊతం లభిస్తుందనే అంశాన్ని బంగ్లాదేశ్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఇరుదేశాల మధ్య వివిధ అనుసంధాన మార్గాలను (మల్టీ-మోడల్ కనెక్టివిటీ) అమలుచేయాల్సిన అవసరం ఉందని అప్పుడే ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్, వ్యవసాయం, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ రేవుల సహకారం, పర్యాటకం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించారు.