రాజీవ్ ఖేల్‌ర‌త్నఇక పై మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న‌:ప్రధాని

ప్రజల విజ్ఞప్తుల మేరకు మార్చామన్న మోడీ

న్యూఢిల్లీ : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్నిట్విట్టర్ లో వెల్లడించారు. క్రీడ‌ల్లో అత్యున్న‌త పుర‌స్కారం అయిన రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్చారు. ఇక నుంచి క్రీడల్లో అత్యున్నత అవార్డును ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరు పెట్టాల్సిందిగా తనకు ఎప్పట్నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయని మోడీ చెప్పారు. వారు వెల్లడించిన అభిప్రాయాలకు ధన్యావాదలు చెప్పారు. ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరును పెట్టామన్నారు. దేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని ఆయన కొనియాడారు.

కాగా, రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1992లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రారంభించారు. అయితే, ఇన్నాళ్లకు ఆ అవార్డుకు ధ్యాన్ చంద్ పేరును పెట్టారు. మూడు వరుస ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ నేతృత్వంలోని హాకీ బృందం స్వర్ణ పతకాలను సాధించింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/