కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వాయిదా..

CM KCR's Maharashtra tour canceled
CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ , జాతీయ స్థాయిలో కూడా అదే మాదిరిగా తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన ఏర్పాట్లు చేసుకున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో ప్రకటన చేయబోతారని వార్తలు కూడా వినిపించాయి. కానీ ప్రస్తుతం ఆ ప్రకటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నెలకొంది. ఇలాంటి తరుణంలో కొత్త జాతీయ పార్టీని ప్రకటించినా అందరి అటెన్షన్ ఎన్నికల వైపే ఉంటుందని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా పార్టీ ప్రకటన వాయిదా పడటానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ టీఆర్ఎస్‌ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూశాకే పార్టీపై ప్రకటన చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో ముగ్గురు లేదా నలుగురు అధికార ప్రతినిధులను నియమించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు కేంద్ర సర్వీసు అధికారులు, కొంత మంది నేతల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుండటంతో పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆయనను ఫోన్‌లో సంప్రదిస్తున్నట్లు సమాచారం.