నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

kcr

హైదరాబాద్‌ః నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలపై మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా, నల్గొండ జిల్లాలో ఆదివారం రాత్రి సమయంలో ఓ బైకర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో బైకర్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు టాటా ఏస్ వాహనంలో హడావుడిగా ఘటనాస్థలికి బయల్దేరారు. ఈ క్రమంలో ప్రమాదస్థలికి అరకిలోమీటరు దూరంలో ఉండగా వారి వాహనాన్ని అయిల్ ట్యాంక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఆ జిల్లాలో తీవ్ర విషాదం నింపింది.