ట్విట్టర్కు కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల జరిమానా
బెంగుళూరు: కర్ణాటక హైకోర్టు ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు తిరస్కరించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం పదిసార్లు ట్విట్టర్ను బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు ట్విట్టర్ తన పిటీషన్లో పేర్కొన్నది. మరో 39 యూఆర్ఎల్స్ను కూడా తీసివేయాలని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను తప్పుపడుతూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటీషన్ను జస్టిస్ కృష్ణ దీక్షిత కొట్టిపారేశారు. ఆ సంస్థపై 50 లక్షల జరిమానా కూడా విధించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విట్టర్ సంస్థ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ తెలిపారు. ట్విట్టర్ సంస్థ ఓ రైతు కాదు, ఓ సాధారణ వ్యక్తి కాదు అని, దానికి చట్టం తెలియదన్న విషయం కాదు అని, అదో బిలియనీర్ కంపెనీ అని కోర్టు పేర్కొన్నది. 45 రోజుల్లోగా కర్నాటక లీగల్ సెల్ సర్వీసెస్కు 50 లక్షలు చెల్లించాలని కోర్టు ట్విట్టర్ను ఆదేశించింది. జస్టిస్ దీక్షిత తన తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమర్ధించారు. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు