కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కన్నుమూత
హైదరాబాద్: కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
జగపతిరావు కవిగా, రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా తనదైన ముద్ర వేశారు. 1972, 1989లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి సారి జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిపొందారు. రెండోసారి కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లోనూ జగపతిరావు పాల్గొన్నారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.