విరాట్ కోహ్లీకి పరోక్షంగా చురకలంటించిన కపిల్దేవ్
ఐపీఎల్ ఆడకపోతే పెద్ద సమస్యేమీ కాదు
న్యూఢిల్లీ: తీరికలేని షెడ్యూల్పై అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తనదైన శైలిలో విమర్శించారు. బీజీ షెడ్యూల్ వల్ల అలసిపోతున్నామని భావిస్తున్న ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటం మానేయాలని సూచించారు. న్యూజిలాండ్ టూర్కు ముందు విరాట్ కోహ్లి..బిజీ షెడ్యూల్పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాను రాను ప్లైట్ దిగి మైదానంలోకి వెళ్లి, ఆటలు ఆడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని నిర్వహకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీనిపై తాజాగా కపిల్ దేవ్ కౌంటరిచ్చారు. విరాట్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా చురకలంటించారు. తీరిక లేని షేడ్యూల్తో అలసిపోతున్నామని భావిస్తే ఐపీఎల్ ఆడొద్దు అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ సూచించారు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు తప్పుకోవాలంటే ఇబ్బంది కానీ..ఐపీఎల్ ఆడకపోవడం పెద్ద సమస్య కాదు అని అన్నారు. ఐపీఎల్లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించడం లేదు కదా అని ప్రశ్నించారు. అలసిపోతున్నామనుకుంటే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకొండి అని కపిల్ దేవ్ సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/