కృష్ణంరాజు మరణంపై కైకాల సత్యనారాయణ ఎమోషనల్

కృష్ణంరాజు మరణంపై కైకాల సత్యనారాయణ ఎమోషనలకు గురయ్యారు. ” కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది.

‘ద్రోహి’ సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు..? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు. అది విని పక్కనే కూర్చున్న అల్లు రామలింగయ్యతో ‘ఏమయ్యా లింగయ్య.. ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా..? ఎవరో గానీ, అన్న గారిలా బాగా రౌద్రంగా చెబుతున్నారు.. ఎవరు..?’ అని ఆతృతగా అడిగితే సొంత డబ్బింగ్ అని చెప్పారు.

అది విని ఆశ్చర్యపోయాను, సినిమా అయిపోయాక వెంటనే ఆయనను కలిసి ‘ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగులు చెబుతున్నావ్.. నువ్వు మరిన్ని చిత్రాల్లో నటించాలి’ అని అంటే.. ఆ మాటకు ఆయన నవ్వుతూ.. ‘అంటే.. ఇప్పుడు నన్ను మీకు కూడా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా..?’ అంటూ నవ్వేశారు. అలా మొదలైన మా పరిచయం మారణ హోమం, ప్రేమ తరంగాలు, అమర దీపం, బొబ్బిలి బ్రహ్మన్న, రావణ బ్రహ్మ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమయ్యేలా చేసింది. ఆయన లాంటి నటుడిని దూరం చేసుకుని కళామ తల్లి బాధపడుతుంది. ఆయన కన్నుమూయడం తెలుగు సినీ జగత్తుకే కాదు మా అందరికీ తీరని లోటు..’ అంటూ కైకల సత్యనారాయణ తెలిపారు.