అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్య కు ప్రభుత్వ కొలువు

వైస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ కొలువు లభించింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆమెకు జూనియర్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పిస్తూ కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా నియామకపత్రాన్ని అపర్ణకు అందజేశారు. ఇటీవల సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టం కింద ఈమెకు ఉద్యోగమిస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా సోమవారం స్పందన కార్యక్రమంలో ఉత్తర్వులను అందజేశారు. అపర్ణ అర్హత ధ్రువపత్రాలను పరిశీలించి, కాంపేషనేట్‌ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎ.హనుమంతరావును కలెక్టర్‌ ఆదేశించారు. కాగా, ఈ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నిన్న ముగిసింది. దీంతో ఆయనను రాజమహేంద్రవరం కోర్టులో ప్రవేశపెట్టగా జులై 1 వరకు ఆయన రిమాండును న్యాయస్థానం పొడిగించింది.