విశాఖ‌లో ఉద్రిక్తత..వైస్సార్సీపీ మంత్రుల కార్ల ఫై జనసేన కార్యకర్తల దాడి

విశాఖ‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా విశాఖ లో వైస్సార్సీపీ విశాఖ గ‌ర్జ‌న‌ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గర్జన కు వైస్సార్సీపీ నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రులు , నేతలు తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వారి కార్ల‌పై జ‌నసేన కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. మంత్రులు జోగి రమేశ్‌, రోజా కార్ల అద్దాలను జనసైనికులు ధ్వంసం చేశారు. కార్లపై పిడిగుద్దులతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని అటాక్‌తో మంత్రులు, నేతలు షాక్ కు గురయ్యారు. రోజా కారుపై జనసేన మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసిరారు.

జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో తమ అధినేతకు స్వాగతం పలికేందుకు.. ఎయిర్‌పోర్టు వద్దకు పెద్దఎత్తున జనసేన శ్రేణులు చేరుకున్నాయి. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమానికి మద్దతు తెలిపిన అనంతరం కార్యక్రమాన్ని ముగించుకుని.. మంత్రి రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లలో ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రావటంతో.. జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా వైస్సార్సీపీ నేతల కాన్వాయ్‌ల మీద దాడికి తెగబడ్డారు. పెద్దఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. కర్రలు, రాళ్లతో దాడి నిర్వహించారు. ఈ క్రమంలో నేతల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.