జగన్ భుజం తట్టడంతో సంబరాలు చేసుకుంటున్న కుప్పం వైస్సార్సీపీ ఇంచార్జీ
కుప్పం వైస్సార్సీపీ ఇంచార్జీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మాములు సంతోషం లేడు. ఏకంగా సీఎం జగన్ భుజం తట్టడం..’భరత్ ద గ్రేట్’ అంటూ సంబోధించడంతో భరత్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసాడు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీ లాబీల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శాసనసభా సమావేశాల కోసం అసెంబ్లీకి వస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసేందుకు అధికార పార్టీ వైస్సార్సీపీ చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి చూపారు. కానీ కుప్పం వైస్సార్సీపీ ఇంచార్జీగా ఉన్న ఎమ్మెల్సీ కేఆర్జే భరత్.. జగన్ను కలిసే అవకాశం దక్కింది.
ఈ సందర్భంగా ఆయనను జగన్ ‘భరత్ ద గ్రేట్’ అంటూ సంబోధించారట. అంతేకాకుండా బాగా పనిచేస్తున్నారంటూ భరత్ను భుజం తట్టిన జగన్ మరింతగా ప్రోత్సహించారు. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ జగన్ తన భుజాన్ని తడుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భరత్… జగన్ తనకు ఇచ్చిన ప్రశంసను కూడా ప్రస్తావించారు. జగనన్న అభినందించడం సంతోషంగా ఉంది అంటూ భరత్ చెప్పుకొచ్చారు.
మరోపక్క ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై టీడీపీ ఎమ్మెల్యేలు వరుస ప్రశ్నలు సంధించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలుమార్లు అసెంబ్లీని వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
పరిపాలనా వికేంద్రీకరణపై జరుగుతున్న చర్చను అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడం లేదని పేర్కొంటూ వారిని సస్పెండ్ చేయాలనీ కోరారు. దీంతో స్పీకర్ ఒక రోజు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సస్పెండ్ చేసారు.