గాజా పై ఇజ్రాయెల్ దాడి.. ఐరాసలో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరం

‘మానవతా సంధి’ తీర్మానాన్ని ప్రతిపాదించిన జోర్డాన్

Israel-Gaza War ..India abstains on UNGA resolution calling for ‘humanitarian truce’

న్యూయార్క్‌ః ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.

ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

జోర్డాన్ రూపొందించిన ఈ తీర్మానంలో ఎక్కడా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రస్తావన లేదు. ఈ విధంగా హమాస్ పేరు చేర్చకపోవడంపై అగ్రరాజ్యం అమెరికా కూడా మండిపడింది. చెడును విస్మరించడమేనని వ్యాఖ్యానించింది. ఇక ఈ తీర్మానంలో సవరణ చేయాలంటూ కెడనా ప్రతిపాదించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన హమాస్ ఉగ్రవాద దాడులను, అమాయకులను బందీలుగా మార్చుకోవడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్న పేరాను జత చేయాలని సూచించింది. కాగా.. అక్టోబరు 7న పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గ్రూప్ ఉగ్రమూకలు ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,400 మందికిపైగా అమాయకులను హతమార్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరంగా ప్రతీకార దాడులు చేస్తోంది.