కాల్పుల్లో గాయపడిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్ లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయమైంది. పాకిస్థాన్‌లోని వజీరాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ కంటైనర్ ట్రక్కుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా దుండగులు పీటీఐ నేతలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన అనుచరులకు కలిపి మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు.

ప్రస్తుతం ఇమ్రాన్ లాహోర్ లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నేత ఫవాద్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. పాకిస్థాన్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై పక్కా ప్రణాళికతోనే కాల్పులు జరిపారని గట్టిగా నమ్ముతున్నామని చౌదరి పేర్కొన్నారు. కాగా, ఇమ్రాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ ర్యాలీ పునఃప్రారంభంపై చర్చించామని, దానిపై నేడు ఓ ప్రకటన చేస్తామని చౌదరి చెప్పారు.