ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు పెట్టిన రజాక్ కుమారుడు

మంగళవారం హత్యకు గురైన సుప్రీంకోర్టు లాయర్ అబ్దుల్ రజాక్

Ex-Pak PM Imran Khan booked under anti-terrorism law after SC lawyer’s murder

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడాయన మెడకు సుప్రీంకోర్టు న్యాయవాది అబ్దుల్ రజాక్ షార్ హత్యకేసు చుట్టుకుంది. పోలీసులు ఆయనపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అబ్దుల్ రజాక్ మంగళవారం హైకోర్టుకు వెళ్తుండగా బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు. తన తండ్రి హత్య వెనక ఇమ్రాన్‌ఖాన్ ఉన్నట్టు ఆయన కుమారుడు సిరాజ్ అహ్మద్ ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఇమ్రాన్‌పై కేసు నమోదైన విషయాన్ని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) నిర్ధారించింది.

ఏప్రిల్ 2022లో జాతీయ అసెంబ్లీని చట్టవిరుద్ధంగా రద్దు చేశారని ఆరోపిస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరికి వ్యతిరేకంగా లాయర్ అబ్దుల్ రజాక్ బలూచిస్థాన్ హైకోర్టులో రాజ్యాంగ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటన తర్వాత తన తండ్రిని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్టు సిరాజ్ ఆ ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు. కాగా, ప్రభుత్వ బహుమతులను విక్రయించిన కేసులో ఇమ్రాన్‌ను ఈ నెల 21 వరకు అరెస్ట్ చేయకుండా కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది.