జ‌గ‌న్‌పై రాయి దాడి .. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 ల‌క్ష‌ల రివార్డు!

Stone attack on Jagan .. If the accused are caught, Rs. 2 lakhs reward!

అమరావతిః విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహ‌న్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుల గురించి తమకు స‌మాచారం అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. అలాగే త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు.

ఇదిలాఉంటే.. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న‌ట్లు అనుమానిస్తున్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? ఎయిర్ గన్‌తో ఏమైనా దాడి చేశారా? లేదంటే క్యాట్‌బాల్‌తో కొట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పాఠ‌శాల‌కు, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమిక విచార‌ణ‌లో తేలింది.

దాంతో ఈ కేసు విషయమై పోలీసులు ఇప్పటివరకు 40 మందిని పైగా విచారించారు. గంగానమ్మ గుడి దగ్గర సెల్‌ టవర్‌ పరిధిలో కాల్స్‌పై నిఘా కూడా పెట్టారు. దీంతో పాటు సీఎంపై జరిగిన దాడి కేసులో విచారణకు ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సీపీ క్రాంతిరాణా ‘సిట్‌’ను ఏర్పాటు చేశారు. అజిత్‌సింగ్ నగర్‌లో 3 సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు.