ఎన్నికల్లో నేను గెలవకుండా ఉండేందుకే విచారణ చేపట్టారుః ట్రంప్

ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న ట్రంప్

trump

వాషింగ్టన్ః తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఉత్తర కరోలినా, జార్జియాలో నిర్వహించిన రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను గెలవకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని, తనకు శిక్ష పడినా సరే పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు.

పదవి నుంచి దిగిపోతూ అధికారిక పత్రాలను ఇంటికి తీసుకెళ్లారన్న అభియోగాలపై విచారణ ఎదుర్కొంటున్న ట్రంప్.. మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకే ఒకదాని వెంట మరో విచారణ చేపడుతున్నారని, తనను వేధింపులకు గురిచేసినా విడిచిపెట్టబోనన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనా తనను తాను క్షమించుకోవాల్సిన అవసరం రాదన్నారు. తాను రిపబ్లికన్‌ను కావడం వల్లే వేధిస్తున్నారని, తనపై విచారణ తంతు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని ట్రంప్ అన్నారు.