భారతదేశం నాలో ఒక భాగం : సుందర్‌ పిచాయ్‌

2022 ఏడాదికి గానూ సుందర్ కు పద్మ భూషణ్ ప్రకటించిన భారత్

i-carry-india-with-me-wherever-i-go-says-google-ceo-sundar-pichai

న్యూఢిల్లీః భారతదేశం తన శరీరంలో అంతర్భాగమని గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళతానని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 ఏడాదికిగానూ సుందర్ పిచాయ్ కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా.. అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ అవార్డును సుందర్ పిచాయ్ కి అందజేశారు. భారత దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ను తనకు అందించడంపై సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను, తన ఎదుగుదలకు సహాయపడిన వారిని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/