ఒక్కసారైనా అండమాన్ జైలును సందర్శించండి
చరిత్ర పుస్తకాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సరైన ప్రాధాన్యం లభించలేదు
చెన్నై: చెన్నైలోని రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రససంగించారు. భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ, తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా, అండమాన్ దీవుల్లో ఉన్న సెల్యులార్ జైలును సందర్శించాలని వెంకయ్యనాయుడు సూచించారు. చరిత్ర పుస్తకాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సరైన ప్రాధాన్యం లభించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. చరిత్రకు సమగ్రత చేకూరాలంటే, స్వాతంత్య్రం పట్ల వారికి ఉన్న భక్తి, తపనలను భావి తరాలు తెలుసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. చరిత్రలో స్వాతంత్య్ర సమర యోధులకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరం అన్నారు. చరిత్రను పరిశీలించి, వారి త్యాగాలను, ఘనతలను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ సంప్రదాయాలను కలుషితం చేయడమే కాకుండా, భారతీయులను హింసించి, మన శ్రమను దోపిడి చేసి, ఇక్కడి సంపదను దోచుకుని వెళ్లిన రాబర్ట్ క్లైవ్ను గొప్పవాడని చదువుతున్నాము ఈ పరిస్థితి మారాలని వెంకయ్యనాయుడు చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/