కేరలో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు అలర్ట్‌ జారీ

విద్యాసంస్థలు మూసివేత

Heavy rains cause floods, closure of schools in parts of Kerala

తిరువనంతపురం : కేరలో గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరువచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలను మూసివేసింది. కొట్టాయం, వైకోమ్‌, చంగనస్సేరి, అలప్పుజాలోని చేర్యాల, చెంగన్నూర్‌ సహా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో వరదల కారణంగా 17 సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో సుమారు 246 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు నాలుగు జిల్లాలకు అలర్ట్‌ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా హై రేంజ్‌లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కోరింది.