నేడు కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌ పై విచారణ

Hearing on Kavitha’s bail petition in court today

న్యూఢిల్లీః ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఈరోజుతో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. దీంతో తీహార్ జైలు అధికారులు నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు. కాగా.. మద్యం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్టు చేశారు. ఈ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న, కవితతో పాటు చరణ్‌ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ ఈడీ రూస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.

ఏప్రిల్‌ 29న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. కవిత, చరణ్‌ప్రీత్‌లు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున.. వారికి కోర్టు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లు జూన్ 3న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా జూన్ 3తో ముగియనుంది.ఈ నేపథ్యంలో కవితతో పాటు మరికొందరిని సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు, మద్యం కుంభకోణంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.