రేవంత్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని..రేవంత్ చేసిన కామెంట్స్ కు టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ వేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఆయన బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కెసిఆర్ సుపరిపాలన అందిస్తున్నారని, మరో 20 ఏళ్లు టిఆర్ఎస్ మాత్రమే అదికారంలో ఉంటుందని గుత్తా జోస్యం చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంతో బిజెపికి ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం బిజెపి నాయకులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆట వస్తువులా ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో బిజెపికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, రాజకీయ లబ్ధి పొందేందుకు ఆయన పేరును బిజెపి నాయకులు వాడుకుంటున్నారని గుత్తా తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని తమ సొంత రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సెప్టెంబర్ 17న విమోచన దినంగా ఎందుకు జరపలేదని గుత్తా ప్రశ్నించారు.