అది చూసి ప్రతిపక్షాలకు జ్వరం పట్టుకుంది?: ప్రధాని

గోవా డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని వ్యంగ్య వ్యాఖ్యలు

YouTube video
PM Modi interacts with healthcare workers & beneficiaries of COVID vaccination programme in Goa

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఇవాళ గోవా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లడారు. టీకా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీలకూ వ్యాక్సిన్ దుష్పరిణామాలు తలెత్తుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. ‘‘వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు తెలిసింది. కానీ, నిన్న రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని తెలిసి రాజకీయ పార్టీలకూ జ్వరం పట్టుకుంది. దానికి కారణం ఏమై ఉండొచ్చంటారు?’’ అని ఓ వైద్యుడిని ఆయన అడిగారు. దీంతో ఆ డాక్టర్ తెగ నవ్వేశారు. వ్యాక్సిన్ తర్వాత కలిగే దుష్పరిణామాలపై లబ్ధిదారులకు సవివరంగా చెబుతున్నామని, వస్తే ఏం చేయాలో సూచనలు చేస్తున్నామని ప్రధాని మోడీ కి డాక్టర్ వివరించారు.

వ్యాక్సినేషన్ డ్రైవ్ లో గోవా విజయవంతంగా ముందుకెళ్తోందని మోడీ కొనియాడారు. సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలో భారీ వర్షాలు, తుపాన్లు, వరదలను రాష్ట్రం ఎంతో సమర్థంగా ఎదుర్కొంటోందని ప్రశంసించారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేస్తున్నందుకు ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సినేషన్ లో ఎదురైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అడిగారు.

ఆరోగ్య కార్యకర్తల శ్రమతో భారత్ అతిపెద్ద రికార్డ్ ను సొంతం చేసుకుందని, ఒకే రోజు రెండున్నర కోట్ల మందికి టీకాలు వేయగలిగామని ప్రధాని మెచ్చుకున్నారు. సంపన్న దేశాలు కూడా ఆ ఘనతను సాధించలేకపోయాయన్నారు. ప్రతి గంటకూ 15 లక్షల మందికి టీకాలు వేశామన్నారు. తన 72వ పుట్టినరోజు నాడు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా, అక్టోబర్ 10 నాటికి వంద కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/