బంగారమే..
భవిష్యత్తులో భద్రత

బంగారం కొనడమంటే ఎవరికైనా ఇష్టమే. కాని డబ్బులు ఉండాలి. ఏదో పండగకో, పెళ్లిళ్లకో మాత్రమే కాదు కొన్ని సందర్భాలలో బంగారం కూడా పెట్టుబడిలా ఉపయోగపడుతుంది.
డబ్బులు ఉంటే బంగా రం కొనుక్కుని ఏమైనా చేయించు కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఆభరణాలుగానే కాదు బంగారాన్ని రకరకాల మార్గాల్లో కొంటుంటారు. కొంతమంది అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం బంగారాన్ని కొంటూ కొంత మొత్తంలో నిలువ చేసుకుంటారు.
నగలు చేసుకోవడానికి కాక భవిష్యత్తులో ఏ విధంగానైనా పనికివస్తుందన్న జాగ్రత్తతో. మనదేశంలో ఎక్కువగా ఆభరణాల రూపంలోనే కొంటుంటారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలోను బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.
దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భద్రతకు ఢోకా ఉండదు. వ్యయాలు పెద్దగా ఉండవు. అన్నిటికి మించి పారదర్శకత ఉంటుంది.
నేరుగా బంగారాన్ని కొనుగోలు చేసే ప్రత్యామ్నాయాల్లో ప్రభుత్వం తరపున ఆర్బిఐ జారీ చేసే సావరిన్ బంగారం బాండ్లు ఉన్నాయి. ఇవి ఒక గ్రాము నుంచి మొదలవుతాయి.

ఎనిమిదేళ్ల గడువుండే వీటిలో అయిదేళ్ల నుంచి మాత్రమే విక్రయించడానికి వీలుంటుంది. ప్రతి రెండు మూడు నెలలకు ఒక వారం పాటు ఈ విక్రయాలను నిర్వహిస్తుంటారు.
లేదంటే సెకండరీ మార్కెట్లో ఎప్పుడైనా వీటిని సొంతం చేసుకోవచ్చు. ఆభరణాలకు బదులు బంగారు నాణేలు, బిస్కట్లు కొంటే వాటిపైన ఎటువంటి తయారీ చార్జీలు ఉండవు. డిజైన్ పాతబడడం అనే మాటే ఉండదు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రోజు ధరకు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇవి కొనడం చాలా సులువైంది. ఇప్పుడు చాలా వరకు ఆభరణాల విక్రయ సంస్థలు బంగారం పథకాలు ప్రవేశపెట్టాయి.
అయితే బంగారం కొనేటప్పుడు నమ్మకమైన దుకాణాలలోనే కొనాలి. మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. బాగా తెలిసిన చోట కొంటే మోసపోకుండా ఉంటాము.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/