కస్తూర్బా ఉమెన్స్ కాలేజీలో గ్యాస్ లీకేజ్..

సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ఈ ఘటనలో 10 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. ఘాటు వాసన కారణంగా కొందరు స్పృహ తప్పి పడిపోయారు. గ్యాస్ పీల్చడంతో 8 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

సమాచారం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్ లీకేజీ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన విద్యార్థునుల తల్లిదండ్రులు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. తమ బిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు