గాంధీయిజమా? బ్రాందీయిజమా?

ఒక్కమాట (ప్రతిశనివారం)

ఇన్ని అనర్థాలకు మూలకారణమైన మద్యాన్ని ఎందుకు నిషేధించలేరు అంటే సంక్షేమ పథకాలకు డబ్బు ఎక్కడినుంచి తేవాలనే ప్రశ్నముందుకు తెస్తున్నారు. రెండురూపాయలకు కిలోబియ్యం మొదలుపెడితే ఎన్నో సంక్షేమపథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. వీటన్నింటికీ డబ్బు ఎక్కడినుంచి తేవాలనేది ప్రశ్న. ఇప్పటికే ఇష్టానుసారంగా పన్నులు వేస్తున్నారు. ఎలాగూ అప్పులకు అలవాటుపడనే పడ్డారు.

Liquor Sales

ఇప్పటికే తెలుగురాష్ట్రాలు దాదాపు నాలుగు లక్షలకోట్ల రూపాయాలకుపైగా అప్పులు చేసాయి. మరొకపక్క అనవసర ఖర్చులు బాగా పెరిగాయి. ఎక్కడెక్కడ పెరిగాయో, ఎందుకు పెరిగాయో అనుభవం ఉన్న పాలకులకు చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ముఖ్యంగా అవినీతిని కొంతవరకయినా అడ్డుకోగలిగితే ఈ నిధులు సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎక్కడ ఏ అధికారిపై దాడులుచేసినా పదులు, వందల కోట్లల్లో అక్రమాస్తులు సంపాదించినట్లు బయటపడుతున్నది. ఇలాంటిపరిస్థితుల్లో నిధులకోసం ప్రజారోగ్యాన్ని తమ ప్రజల బతుకులను పణంగా పెట్టడం ఏమాత్రం సమంజసమో పాలక పెద్దలు ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలి.

‘జ నవరి ముఫ్పైసోదరా..జాతికి ముప్పయినాదిరా.. కరమ్‌చంద్‌ నేడుండినా ఈ నిషా బంద్‌కాకుండెనా అని ఓ కవి ఎంతో ఆవేదనతో అన్నాడు. నిజానికి మద్యనిషేధం అన్నది మహాత్ముడు భారతప్రజలకు అందించిన అమృత సందేశం. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి మద్యపానాన్ని దేశం నుంచి పారద్రోలడానికి సిద్ధాంతం. నినాదం. అఖిలభారత కాంగ్రెస్‌ సమావేశాల్లో ఎన్నోసార్లు తీర్మానాలు కూడా చేసారు.ఏటా గాంధీ వర్ధంతిలు, జయంతులను ఘనంగా క్రమం తప్పకుండా చేసుకుం టున్న పాలకులు ఆయన సిద్ధాంతాలకు ఆదర్శాలకు తిలోదకాలి స్తున్నారు.

మొన్న గురువారం దేశవ్యాప్తంగా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.గ్రామస్థాయిలో ఉండే సర్పంచు మొదలు ప్రధానమంత్రి,రాష్ట్రపతి, ఒక్కరేమిటి ఉన్నత పదవ్ఞల్లో ఉన్నవారం దరూ మహాత్ముడికి నివాళ్లు అర్పించారు. వర్ధంతులు, జయంతులే కాదు ఏ సందర్భంలోనైనా గాంధీ గురించి గంటల తరబడి ఉపన్యాసాలిచ్చే పెద్దలు మద్యం విషయంలో మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పరిస్థితులు ఎలా వచ్చాయంటే ఆదాయం కోసం ప్రభుత్వాలే దుకాణాలు పెట్టించి మద్యం సేవించండి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చండి అంటూ బతిమాలో భంగపడో తాగించే దురదృష్టపు రోజులు దాపురించాయి.

పార్టీల మేనిఫెస్టోల్లో కూడా ఎన్నోసార్లు సంపూర్ణ మద్యనిషేధాన్ని ప్రకటించారు. 2004 ఎన్నికల్లో దశలవారీగా రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేస్తామని హామీలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చినతర్వాత ఏడాదికేడాది ఆదాయం పెంచుకుం టున్నారు. ఏమిచేసైనా మద్యం ద్వారా ఆదాయాన్ని ఎంతవీలైతే అంత పెంచుకోవాలనే ధ్యేయంగా విధానాన్ని అమల్లో కూడా వెసులుబాటు కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్‌షాపుల విధానాన్ని ప్రవేశపెట్టి తెలుగుదేశం నేతలు పుణ్యం కట్టుకున్నారు. రికార్డుపరంగా సారా నిషేధించారు.

కానీ అమలు చేసే త్రికరణ శుద్ధి పాలకులకు లేదనేది కాదనలేని నిజం.ఈ అక్రమవ్యాపారాన్ని ఎలాగూ ఆపలేమని కొందరు మద్యం వ్యాపారులు మద్యంపేరుతో చీప్‌ లిక్కరును తయారుచేసి నాటుసారా తాగేవారిని తమవైపు నకు తిప్పుకుంటున్నారు.చీప్‌ లిక్కర్‌ అమ్మకాలే తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ చీప్‌ లిక్కర్‌ తాగి లక్షలాదిమంది నిరుపేదలు ఆసుపత్రుల పాలవుతున్నారు. తాగగానే కొందరు ప్రాణాలు హరీ అంటున్నాయి. చీప్‌ లిక్కర్‌ తాగి కృంగి కృశించి మంచానికే పరిమితమై లేవలేని స్థితిలో కొందరుప్రాణాలు కోల్పో తున్నారు. మరికొందరుప్రాణాంతక వ్యాధుల పాలవుతున్నారు. ఇదంతా ఎక్సైజ్‌ అధికారులకు తెలియంది కాదు.

ఒకప్పుడు ఎక్సైజ్‌శాఖ అధికారులంటే గడగడలాడేది. ఈ అక్రమ వ్యాపారం ఇపుడు వారిని పట్టించుకునేపరిస్థితిలో కూడా లేదు. ఒక పక్క లంచాలు మరొకపక్క రాజకీయ ఒత్తిడులతో వానపాముల్లాగా మారి కాలం గడుపుతున్నారు. అందుకే వీరిని నిందించేకంటే ఈ పాపానికి పాలకులనే బాధ్యుల్ని చేయాలి. ప్రజలసంక్షేమమే తన ధ్యేయమని చెప్పుకునే నేతలు నిరుపేదలిలా బలైపోతున్నా డబ్బుసంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తుంటే ఏమని చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి. ఎందరిపేదల బతుకులు ఛిద్రం అవుతున్నా యో ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలి. ఇక నేరాల గురించి కానీ,ప్రమాదాల గురించికానీ ప్రస్తావిస్తే అన్నింటికీ మూలం మద్య మనేది కాదనలేని వాస్తవం.ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా 10వేలమందికిపైగా మరణిస్తున్నారు.

90శాతానికిపైగా ఈ ప్రమా దాలకు కారకులైన వాహనచోదకులు మద్యం మత్తులో ఉన్నవారే. పోలీసు రికార్డుల్లోనే వెల్లడవుతున్న వాస్తవాలు పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు అధికా రులకు కూడా ఈ విషయం క్షుణ్ణంగా తెలుసు. అయినా వారు జరిమానాలతోను కేసులతోను సర్దుకుంటున్నారే తప్ప తాగుడు వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే నిజాన్ని అంగీకరించినా తాగుడును నిషేధించే దిశగా ప్రభుత్వానికి సలహా లివ్వలేకపోతు న్నారు.

ఇక నేరాలు ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యా చారాలు హత్యలలోని నిందితుల్లో 95శాతానికి పైగా మద్యం మత్తులో జరిగినవే. ఆనాటి నిర్భయకేసులో త్వరలో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నిందితులు మద్యంమత్తులో ఉన్నట్లు పోలీ సుల దర్యాప్తులోనే బైటపడింది. ఒక్క ఈకేసులోనే కాదు ప్రేమో న్మాదులు కూడా మద్యం మత్తులోనే దారుణాలకు పాల్పడుతున్నా రు. అంతెందుకు మొన్న అత్యంత కిరాతకంగా హైదరాబాద్‌ నగర శివార్లలో శంషాబాద్‌ వద్ద పశువైద్యురాలు దిశకేసులో నిందితులు కూడా పూర్తి మద్యం మైకంలో ఉన్నారు. వారు తాగడమేకాదు. దిశనోట్లో బలవంతంగా బాటిల్‌పెట్టి మద్యంపోసారు.

మైనర్లకు మద్యం అమ్మరాదనే నిబంధనలున్నా అవేమీ అమలుకావడంలేదు. జాతీయ రహదారులపై మద్యం షాపులుండరాదని స్పష్టమైన ఆదేశాలున్నా చివరకు రోడ్ల హోదానే తగ్గిస్తున్నారు తప్ప మద్యం షాపులను తరలించలేకపోతున్నారు.ఇన్ని అనర్థాలకు మూలకారణ మైన మద్యాన్ని ఎందుకు నిషేధించలేరు అంటే సంక్షేమపథకాలకు డబ్బు ఎక్కడినుంచి తేవాలనే ప్రశ్నముందుకు తెస్తున్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం మొదలుపెడితే ఎన్నో సంక్షేమపథకా లు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. వీటన్నింటికీ డబ్బు ఎక్కడినుంచి తేవాలనేది ప్రశ్న. ఇప్పటికే ఇష్టానుసారంగా పన్నులు వేస్తున్నారు.ఎలాగూ అప్పులకు అలవాటుపడనే పడ్డారు.

ఇప్పటికే తెలుగురాష్ట్రాలు దాదాపు నాలుగు లక్షలకోట్ల రూపాయాలకుపైగా అప్పులుచేసాయి. మరొకపక్క అనవసర ఖర్చులు బాగా పెరిగాయి. ఎక్కడెక్కడ పెరిగాయో, ఎందుకు పెరిగాయో అనుభవం ఉన్న పాలకులకు చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ముఖ్యంగా అవినీతిని కొంతవరకయినా అడ్డుకోగలిగితే ఈ నిధులు సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎక్కడ ఏ అధికారిపై దాడులుచేసినా పదులు, వందల కోట్లలో అక్రమాస్తులు సంపాదించినట్లు బయట పడుతున్నది. ఇలాంటిపరిస్థితుల్లో నిధులకోసం ప్రజారోగ్యాన్ని తమ ప్రజల బతుకులను పణంగా పెట్టడం ఏమాత్రం సమంజ సమో పాలక పెద్దలు ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలి.

ఇక్కడ ఒక సంఘటన గుర్తుకువస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వంకాలంలో వారుణవాహిని పేరుతో గ్రామాలకు గ్రామాలనే మత్తులో ముంచు తున్న రోజులవి. కరీంనగర్‌ కలెక్టర్‌, జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ అప్పటి పార్లమెంటు సభ్యులు జువాది చొక్కారావులతోపాటు అధికారులు మల్యాల సమీపంలో ఒకగ్రామంలో కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ వరికోతలు ముగించుకుని ఇంటికి వెళుతున్న మహిళలతో ముచ్చటించారు.

మద్యం సారా అమ్మకాల గురించి చొక్కారావు ఆ మహిళను ప్రశ్నించారు. సారా అమ్మకాల వల్ల కుటుంబాలు కూలి పోతున్నాయని తాగుబోతుల సంఖ్య పెరిగిపోతున్నదనిసాయంత్రం అయితే బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ముఖ్యంగా వారుణవాహిని రావడంతో ఎక్కడ పడితే అక్కడ తాగి ప్యాకెట్లు పడేస్తున్నారని, చిన్నపిల్లలు కూడా బానిసలవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తంచేసారు. ”రెండురూపాయల కిలో బియ్యం కావాలి. రోడ్లుకావాలి. కరెంటు సబ్సిడీ కావాలి.అంటారు వీటన్నింటికి డబ్బు ఎక్కడినుంచి వస్తున్నది? ఎలాచేస్తామనివారిని చొక్కారావు ఎదురు ప్రశ్నవేసారు.

అలా వస్తున్న ఆదాయంతోనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని కలెక్టర్‌ కూడా వివరించారు. దీనితో అప్పటివరకూ వెనుక ఉండి సంభాషణ అంతా ఓపిగ్గా వింటున్న ఒక యువతి ఒక్కసారిగా ముందుకువచ్చి ఊరికి ఒక వ్యభిచార గృహానికి లైసెన్సు ఇవ్వండి.లైసెన్సుకింత ఫీజుపెట్టండి. అప్పుడు డబ్బు చాలావస్తుంది. సంక్షేమకార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయవచ్చని ఒక్కసారి కలెక్టర్‌నుద్దేశించి అనడంతోఅందరూ నివ్వెరపోయారు. మద్యపానం పట్ల మహిళలు ఎంతటి మానసిక వేదన చెందుతున్నారో ఈ సంఘటన అద్దం పడుతున్నది.

ఆ తర్వాత ఈ విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దృష్టికి చొక్కారావు స్వయంగా తీసుకువెళ్లారు. లిఖితపూర్వకంగా అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మరింత దిగజారింది. 1980లో నిర్వహించిన సర్వేప్రకారం 25 ఏళ్లనుంచి 28 ఏళ్లవరకూ వయసున్న వారే తాగుడుకు అలవాటుపడుతున్నట్లు తేలింది.కానీ ఇప్పుడు 17 ఏళ్ల నుంచే తాగుడు మొదలవుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నా యి.

ఇదే పరిస్థితి కొనసాగితే పది పదిహేనేళ్లనుంచి కూడా మొదలైనా ఆశ్చర్యపోనవసరంలేదు. రాజకీయ పదవులు శాశ్వతం కాదు. కొందరికే ఉన్నత పదవుల అవకాశం లభిస్తుంది. అందు లోను ముఖ్యమంత్రిత్వం రాజకీయ నాయకులకు పరమపదసోపా నంలో ఉన్నతస్థానం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి అవకాశం దొరకదు. పాలక పెద్దలు ఇప్పటికైనా మనసుపెట్టి ఆలోచించాలి. మహాత్ముణ్ణిమరిచిపోలేదంటూ ఏటా నిర్వహిస్తున్న గాంధీ జయంతి, వర్ధంతిలకు అర్థం పర్థం ఉంటుంది.

  • దామెర్ల సాయిబాబ

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/