టిక్కెట్ కేటాయింపు ముఖ్యమైన విషయం కాదు.. బిఆర్ఎస్‌ను గద్దె దించడమే ముఖ్యంః వివేక్‌

వివేక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడుకు వంశీ

former-mp-vivek-joins-congress-party

హైదరాబాద్‌ః మాజీ ఎంపీ వివేక్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. వివేక్‌తో పాటు ఆయన తనయుడు వంశీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు.

కేసీఆర్ కుటుంబం వారి ఆకాంక్షల మేరకే పని చేస్తోందన్నారు. కేసీఆర్‍‌ను గద్దె దింపాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. టిక్కెట్ కేటాయింపు తనకు అంత ముఖ్యమైన విషయం కాదని, బీఆర్ఎస్‌ను గద్దె దించడమే ముఖ్యమన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బిఆర్ఎస్‌ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వివేక్ నమ్మారని చెప్పారు. ఆయన చేరికతో పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.