మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి ఇవాళ కన్నుమూశారు. ముంబయి ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 ఏళ్లు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ముంబైలోని శివాజీపార్క్లో ఉన్న శ్మశానవాటికలో మనోహర్ జోషికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పీడీ హిందూజా ఆస్పత్రిలో ఆయన గత కొంత కాలం నుంచి చికిత్స పొందుతున్నారు. మనోహర్ జోషి శివసేన పార్టీలో అగ్రస్థాయి నేతగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదిగి 1995 నుంచి 1999 మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇక మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో 2002-2004 కాలంలో లోక్సభ స్పీకర్గానూ పనిచేశారు.
మనోహర్ జోషి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1937 డిసెంబర్ 2న నాంద్వీలో జోషి జన్మించారు. ఆయన ముంబైలో చదువుకున్నారు. ఆయన భార్య అనఘ మనోహర్ జోషి 2020లో కన్నుమూశారు. ఆయనకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. . తొలినాళ్లలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1967లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. స్టాండింగ్ కమిటీ (మున్సిపల్ కార్పొరేషన్) ఛైర్మన్గానూ ఎంపికయ్యి సేవలు అందించారు. 1967-77 మధ్యకాలంలో ముంబై మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 1972లో మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాక 1990లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 1990-91 మధ్యకాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున పోటీ చేసి ముంబయి నార్త్-సెంట్రల్ సీటు నుంచి ఎంపీగా విజయం గెలిచారు.