ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. పలు విమానాల రాకపోకలకు అంతరాయం

Flight Ops Hit In Delhi, Hyderabad Amid Dense Fog, Passengers Alerted

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విజిబిలిటీ 125 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వివిధ ఎయిర్‌ పోర్టుల్లో కూడా విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్‌సర్‌, ఆగ్రా, గ్వాలియర్‌, ప్రయాగ్‌రాజ్‌, జైసల్మేర్‌ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్‌ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక మరికొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరాల్సిన ఆరు విమానాలను సైతం దారి మళ్లించినట్లు వెల్లడించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన UK897 విమానం, ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన UK873 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి బెంగళూరుకు దారి మళ్లించారు.