సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

టింబర్ డిపోలో అగ్నిప్రమాదం..షార్ట్ సర్క్యూటే కారణం

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోయగూడ ఐడీహెచ్ కాలనీలోని టింబర్, తుక్కు డిపోలో జరిగిన ఈ ఘటనలో 11 మంది వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా గత రాత్రి అందులోనే నిద్రపోయారు. ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా డిపోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నిద్రిస్తున్న 12 మందిలో 11 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను బీహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/