ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.25 శాతానికి పెంపు

EPFO fixes 8.25 % interest rate on employees’ provident fund for 2023-24

న్యూఢిల్లీః ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌ ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 శాతం వడ్డీరేటును నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లలో ఇదే అత్యధికం.

సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు.