కెసిఆర్ సభ నిర్వహిస్తున్న సంగతి నాకు తెలియదు: నితీశ్ కుమార్

ఆహ్వానం అందుకున్న నేతలంతా వెళ్లారన్ననితీశ్

Nitish kumar
Nitish kumar

పాట్నాః ఖమ్మంలో సిఎం కెసిఆర్‌ నిర్వహించిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ సభ నిర్వహిస్తున్న సంగతి తనకు తెలియదని, ఆహ్వానం అందుకున్న వారంతా వెళ్లారని అన్నారు. తాను మాత్రం ఇతర పనుల్లో బిజీగా ఉన్నానని అన్నారు. బీఆర్ఎస్ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్‌మాన్ సింగ్, పినరయి విజయన్‌లు మాత్రమే పాల్గొన్నారు. అలాగే, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి.రాజా హాజరయ్యారు.

ఈ సభకు రావాలంటూ కెసిఆర్ స్వయంగా నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీఎస్ నేత కుమార స్వామి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లను ఆహ్వానించినట్టు వార్తలొచ్చాయి. కానీ, వీరెవరూ సభకు హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే, జేడీఎస్, ఆర్జేడీలు మాత్రం తమకు ఆహ్వానం అందలేదని చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దించేందుకు ప్రతిపక్షాల ఐక్యత ముఖ్యమని పదేపదే చెబుతున్న నితీశ్ కుమార్ కూడా ఈ సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/news/international-news/