తిరుపతి ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి కరోనా లేదు
పరీక్షించి, వైరస్ సోకలేదని స్పష్టం చేసిన వైద్యులు

తిరుపతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో చేరిన వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అతడికి వైరస్ లేదని తేల్చి చెప్పారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ ఉందని తేలడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో కొద్దిపాటి భయం నెలకొన్న నేపథ్యంలో ఆ వైరస్ లక్షణాలతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మరో వ్యక్తి చేరడంతో ఈ భయం మరింత పెరిగింది. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు అతడికి వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. ఇటీవల తైవాన్కు చెందిన చెన్ షి షున్(35) అనే వ్యక్తి ఇక్కడకు వచ్చాడని, అతడి రక్త నమునాలను పరీక్షల నిమిత్తం పూణేకు పంపామని రుయా వైద్యులు చెప్పారు. కరోనా నెగటివ్ ఫలితాలు వచ్చాయని, అతడిని ఈ రోజు డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. కాగా, ఇటీవల తైవాన్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఇక్కడి అమరరాజ గ్రూప్స్ సంస్థలో పని చేస్తున్నారు. అతడికి కరోనా లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేరాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/