భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతులు
భీవండి: ముంబయిలోని భీవండిలో సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాలు( ఎన్డీఆర్ఎఫ్) బృందాలు తెలిపాయి. భవనం శిథిలావస్థకు చేరడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడి సంతాపం తెలిపారు. ‘భీవండి ఘటన ఎంతగానో కలచివేసింది. బాధితుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ‘భవనం కూలిపోవటం విచారకరం. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలకు నా సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తాం’ అని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/