కాంగ్రెస్ పార్టీని వీడబోతున్న దాసోజు శ్రవణ్…? బుజ్జగిస్తున్న కాంగ్రెస్ నేతలు..

dasoju sravan resign congress party

టి కాంగ్రెస్ పార్టీ లో ఏంజరుగుతుందో అర్థంకావడం లేదు. అంత సెట్ అయ్యింది అని అనుకున్నారో లేదో..వరుస పెట్టి కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతుండడం కార్యకర్తలను అయోమయంలో పడేస్తుంది. మొన్నటికి మొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. ఇదే అనుకుంటే ఇప్పుడు పార్టీ కీలక నేత, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్‌.. గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే.. పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్‌ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

తాను పోటీ చేస్తున్న స్థానంలో సొంత పార్టీలోనే పోటీ నెలకొనడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరమయ్యారు. ఈ దుమారం నుంచి పార్టీ ఇంకా కోలుకోక ముందే దాసోజు శ్రవణ్ రాజీనామా చేయనున్నారనే అంశం తెరపైకి రావడం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్ ఆఫీస్ కు చేరుకొని బుజ్జగింపులు చేస్తున్నారు.