మమతా బెనర్జీ సాయం లేకుండానే ఎన్నికల బరిలో దిగుతాంః అధిర్ రంజన్
న్యూఢిల్లీః పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అవకాశవాదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి విరుచుకుపడ్డారు. దీదీ సహకారం లేకుండానే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని ఆయన అగ్ర నాయకత్వాన్ని కోరారు. తాము మమతా బెనర్జీ సాయం లేకుండానే ఎన్నికల బరిలో దిగుతామని, తాము తమ సొంత బలంతోనే ఎన్నికల బరిలో ఉంటామని అధిర్ రంజన్ స్పష్ఠం చేశారు. కాంగ్రెస్ సాయంతోనే బెంగాల్లో టీఎంసీ అధికారంలోకి వచ్చిందనే విషయం దీదీ గుర్తుంచుకోవాలని అన్నారు. అధిర్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల్లో గందరగోళం నెలకొంది. అధిర్ గతంలోనూ పలుమార్లు మమతా బెనర్జీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో సీట్ల సర్ధుబాటు విషయంలోనూ ఇటీవల టీఎంసీ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. బెంగాల్లో కాంగ్రెస్కు మమతా బెనర్జీ కేవలం రెండు సీట్లు ఆఫర్ చేశారని, సీట్ల కోసం కాంగ్రెస్ వెంపర్లాడదని దీదీని దుయ్యబట్టారు.