కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే.. థరూర్ పై ఘన విజయం
ఖర్గేకు 7,897 ఓట్లు.. థరూర్ కి 1,072 ఓట్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలుపొందారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన శశి థరూర్ పై ఆయన ఘన విజయం సాధించారు. మొత్తం 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా… థరూర్ కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తి చేపట్టనుండటం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి ఖర్గే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారు.
కాగా, ఖర్గే వయసు 80 ఏళ్లు. కర్ణాటకలోని బీదర్ జిల్లా భల్కి తాలూకా వరావట్టి గ్రామంలో (అప్పట్లో నిజాం సంస్థానం) 1942లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య రాధా బాయి, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఖర్గే బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు.