ఇండియా కూటమి గురించి ఆ పార్టీ పట్టించుకోవడం లేదుః నితీశ్ కుమార్
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి సర్కార్పై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కూటమిలో జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందని, ఇండియా కూటమి గురించి ఆ పార్టీ పట్టించుకోవడం లేదని సీఎం నితీశ్ కుమార్ ఆరోపించారు.
పాట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజెపి హటావో, దేశ్ బజావో ర్యాలీని ఉద్దేశిస్తూ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. బిజెపిని ఎదుర్కొనేందుకు కూటమిని ఏర్పాటు చేసింది నిజమే కానీ, ఆ దిశగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పనిచేయడంలేదన్నారు. అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పనిచేస్తున్నామని, కానీ ఆ పార్టీ మాత్రం ఈ అంశంలో ఆసక్తిగా లేనట్లు తెలుస్తోందన్నారు.