ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్వరం
కొవిడ్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు!
హైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం బారినపడ్డారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంటి వద్ద ఫ్యామిలీ డాక్టర్… రేవంత్ రెడ్డిని పరీక్షించి, మెడిసిన్స్ అందించారని తెలుస్తోంది. నిన్న సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి కాస్త నీరసంగా కనిపించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం.
కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లు రేవంత్ రెడ్డి కి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వల్ప జ్వరమే ఉందని.. తీవ్రమైతే హాస్పిటల్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేళ సీఎంకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇటీవల ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా టెస్టులు చేయించుకోనున్నారు.