నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్‌

ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కెసిఆర్

CM KCR will go to Delhi today

హైదరాబాద్ః సిఎం కెసిఆర్‌ నేడు దేశ రాజధాని హస్తినకు పయనమవుతున్నారు. ఈ నెల 9న టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో… 14న పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగాలనే అభీష్టంతో సర్దార్ పటేల్ రోడ్ లోని పార్టీ తాత్కాలిక కార్యాలయంలో యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో కేసీఆర్ పాల్గొంటారు.

కెసిఆర్ కు దైవంపై భక్తిభావం ఎక్కువనే విషయం తెలిసిందే. సీఎం అయిన తర్వాత ఆయన చండీయాగాన్ని నిర్వహించారు. రెండో సారి ఎన్నికలకు వెళ్లే ముందు… టిఆర్ఎస్ విజయం కోసం రాజశ్యామల యాగాన్ని నిర్వహించడం జరిగింది. రెండో సారి సీఎం అయిన తర్వాత సహస్ర మహా చండీయాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో తన జాతీయ పార్టీ బిఆర్ఎస్ విజయం సాధించాలనే కోరికతో ఢిల్లీలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించబోతున్నారు.

మరోవైపు, తన ఢిల్లీ పర్యటనలో ఐదు రోజుల పాటు కెసిఆర్ అక్కడే మకాం వేయనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, ఓబీసీ సంఘాల నేతలతో చర్చించి, బిఆర్ఎస్ కు వారి మద్దతును కోరనున్నారు. రిటైర్డ్ ఆలిండియా సర్వీస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులతో ఈ రాత్రి సమావేశం కానున్నట్టు సమాచారం. 14వ తేదీన బిఆర్ఎస్ పార్టీ కార్యవర్గం, భవిష్యత్ కార్యాచరణపై కెసిఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. 15వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మాణంలో ఉన్న పార్టీ శాశ్వత కార్యాలయానికి సంబంధించిన పనులను కెసిఆర్ పరిశీలించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/