కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం వస్తుందిః సిఎం కెసిఆర్‌

రైతుబంధు, దళితబంధును సృష్టించిందే బిఆర్ఎస్.. సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting at Jukkal

నిజామాబాద్ : 2004లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ ఇస్తే ఇప్పటికంటే మరింతగా అభివృద్ధి చెంది ఉండేవారమని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణకు కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఎవరెవరో ఏదేదో చెబుతారని, వారి మాటలు వినవద్దన్నారు. మీపక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో రైతుల పరిస్థితి చూస్తున్నారన్నారు. ఈ రెండు రాష్ట్రాలు మీకు దగ్గరే ఉన్నాయన్నారు. పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, కానీ మనం తెలంగాణలో ఇస్తున్నామన్నారు.

నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి తాము విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ తెలంగాణ మాత్రమే ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తుందని తాను ఆయనకు చెబుతున్నానన్నారు. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు రైతుబంధు దుబారా అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రైతుబీమా, రుణమాఫీ వంటి వాటితో రైతులకు ఊరట ఇచ్చినట్లు చెప్పారు. జుక్కల్‌లో కరువు ఉంటుందని ఇదివరకు పిల్లను ఇవ్వాలంటే భయపడేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాకముందు పదేళ్ల క్రితం మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆలోచించి ఓటేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవి మూడో ఎన్నికలను, కాబట్టి ఈ సమయంలో ప్రజలు ఆగం కావొద్దన్నారు. సమైక్య పాలనలో నిజాంసాగర్ ఎండిపోయిందన్నారు. ఈ ఎండిన నిజాంసాగర్ చెరువులోనే మనం తెలంగాణ ఉద్యమం సమయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. 2004లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణ ఇవ్వలేదని, కానీ 2009లో ఉద్యమం తీవ్రతరం కావడంతో తెలంగాణను ప్రకటించారన్నారు. ఆ తర్వాత కూడా జాప్యం చేశారని, దీంతో మరో అయిదేళ్లు ఆలస్యమైందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకులుగా వాడుకుందని ఆరోపించారు. కానీ మనం దళిత బంధుతో క్రమంగా అండగా నిలబడుతున్నామన్నారు. లంబాడీలను, ఆదివాసీలను గౌరవించే ఉద్దేశ్యంతో తండాలను గ్రామపంచాయతీలుగా చేశామన్నారు. గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉండేవారని, కానీ ఇక్కడి ఎమ్మెల్యే షిండే మాత్రం నెలకు 25 రోజులు నియోజకవర్గంలోనే ఉంటున్నారన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణ బాధను పట్టించుకున్నది లేదన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? లేదా? చూడవచ్చునన్నారు. పదేళ్ల క్రితమే పుట్టిన మన తెలంగాణ ఎన్నో రాష్ట్రాలను దాటి వీటిలో ముందు ఉన్నదన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. అలాగే విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కనుక దళారుల రాజ్యం వస్తుందన్నారు. తెలంగాణలో కెసిఆర్ ఉన్నంత వరకు సెక్యులర్‌గానే ఉంటుందన్నారు.