జానారెడ్డి మాట మీద నిల‌బ‌డ‌లేదు..గులాబీ కండువా క‌ప్పుకోలేదుః సిఎం కెసిఆర్‌

నాలుగేళ్లలో 24 గంటల విద్యుత్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని జానా సవాల్ చేశారు.. సిఎం కెసిఆర్‌

cm-kcr-fires-at-janareddy-for-not-joining-brs

హైదరాబాద్‌ః రెండేళ్లలో కాదు.. నాలుగేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తే తాను కాంగ్రెస్ కండువాను తీసేసి… గులాబీ కండువాను కప్పుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పారని, కానీ ఏడాదిన్నరలోనే తాము ఈ హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధి హాలియాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తామిచ్చిన హామీని ముందే నెరవేర్చామని, కానీ జానారెడ్డి మాట మీద నిల‌బ‌డ‌లేదు.. ఆయన పార్టీ మార‌లేదు.. గులాబీ కండువా క‌ప్పుకోలేదని కెసిఆర్ ఎద్దేవా చేశారు.

జానారెడ్డి పెద్ద లీడర్ అని, ఆయన మంత్రిగా పనిచేశాడని, అలాగే ప్రతిపక్ష నేతగానూ పని చేశాడన్నారు. తాను సీఎం అయిన మొదట్లో కరెంట్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. దీనిని గుర్తించిన తాను రెండేళ్లలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పానన్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి రెండేళ్ళు కాదు నాలుగేళ్లలో కరెంట్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని సవాల్ చేశారని, కానీ ఆయన మాట మీద నిలబడలేదన్నారు. పైగా గత ఎన్నికల్లో నోముల భగత్ మీద పోటీ చేశారని మండిపడ్డారు. దీంతో ప్రజలంతా జానారెడ్డికి బుద్ధి చెప్పారన్నారు.

జానారెడ్డి ఇప్పుడు కూడా కలలు కంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతానని భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు. జానా హ‌యాంలో నాగార్జున సాగ‌ర్‌లో ఓ డిగ్రీ కాలేజీ కూడా లేదని, నోముల భ‌గ‌త్ ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ మంజూరు చేశామన్నారు. హాలియాలో 50 ప‌డ‌క‌ల హాస్పిటల్‌ను ఏర్పాటు చేశామన్నారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రెండు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు ప్రారంభమయ్యాయని, ఇవి ఎనిమిది నెల‌ల్లో పూర్త‌వుతాయన్నారు. తానే వచ్చి ప్రారంభం చేస్తానని కెసిఆర్ అన్నారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం ఉంటే బాగుంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ఎన్నడూ కూడా ధైర్యంతో ప‌ని చేసి అన్ని వ‌ర్గాల‌ను ఆదుకునే ప‌ని చేయలేదన్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలన్నారు.