ఏపీలో వర్సిటీ కులపతిగా సీఎం .. రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ
ఈ మేరకు చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
అమరావతిః ఏపిలో ఓ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి చాన్సలర్ గా వ్యవహరించేలా చట్టానికి సవరణలు చేశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఛాన్సలర్గా సీఎం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నర్లు కులపతులుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో అక్కడి గవర్నర్లు, ప్రభుత్వాలకూ మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని వర్సిటీలకు సీఎంలే ఛాన్సలర్లుగా ఉండేలా చట్టానికి సవరణలు చేశారు. ఏపీలో ట్రిపుల్ ఐటీల కోసం ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీకి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేలా చట్టాన్ని సవరించారు.