అరుదైన పురస్కారానికి చిరంజీవి ఎంపిక

మెగాస్టార్ చిరంజీవి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. చిత్రసీమకు చిరంజీవి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆయనకు అందిస్తోంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవి పేరును కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వేదికపై ప్రకటించారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ‘‘శ్రీ చిరంజీవి గారిది సుమారు నాలుగు దశాబ్దాల సుధీర్ఘ ప్రయాణం. 150 సినిమాల్లో నటుడిగా, డాన్సర్‌గా, నిర్మాతగా పనిచేశారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చాలా పాపులర్. తన అద్భుతమైన నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారు’’ అని అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి రిప్లయ్ ఇచ్చారు. ఈ అవార్డును తనకు ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ఎంతగానో ప్రేమించే అభిమానుల వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని పేర్కొన్నారు.