డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపగా..ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారిని ప్రజాభవన్ లో కలిశారు. చిరంజీవి తో పాటు ఆయన సతీమణి సురేఖ లు మర్యాదపూర్వకంగా కలిసి, కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో సత్కరించారు. విక్రమార్క వెంట సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే కీలక హామీలైన మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పెంపు పధకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో నమ్మకం కూడగట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పధకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది.