రోడ్డు ఆక్సిడెంట్ లో ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ మృతి

ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ యడ్ల లక్ష్మణ్‌యాదవ్(52) మృతి చెందారు. మధురవాడకు చెందిన లక్ష్మణ్‌ యాదవ్ ఆర్టీసీ డ్రైవర్. గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. నిన్న విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా… కొమ్మాది కూడలి వద్ద వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఆయన బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై ఎగిరిపడిన ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

కొమ్మాది సిగ్నల్ వద్ద కుడివైపునకు తిరగాల్సిన ఆయన రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాన్ని ఒక్కసారిగా నిలిపివేశారు. దీంతో వెనకనుంచి వస్తున్న లారీ వేగాన్ని నియంత్రించలేక ఆయన బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్ యాదవ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. ఆయన మృతి విషయం తెలిసి చిరంజీవి అభిమానులు, జనసైనికులు, టీడీపీ, వైసీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి నివాళులు అర్పించారు.