‘మమతా బెనర్జీ లేని భారత కూటమిని ఊహించలేం’: కాంగ్రెస్
న్యూఢిల్లీః రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని ఆ పార్టీ స్పష్టం చేసింది. దీదీతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇక అంతకుముందు రాహుల్ గాంధీ సైతం మమతా బెనర్జీ తనకు అత్యంత సన్నిహితురాలని లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీతో కలిసి పోటీ చేస్తామని, ఈ దిశగా పొత్తు చర్చలు సాగుతున్నాయని అన్నారు.
అయితే బెంగాల్లో కాంగ్రెస్ దీదీ సహకారం లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అవకాశవాది అయిన మమతా బెనర్జీ పార్టీతో కలిసేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా వాటిని పట్టించుకోబోమని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.
బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి చర్చలూ జరపలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని చెప్పారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ వెల్లడించారు.మరోవైపు రాహుల్ యాత్ర పై కూడా దీదీ స్పందించారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్ యాత్రపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. రాష్ట్రం మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది.. అయినా మాకు సమాచారం ఇవ్వలేదు అని దీదీ కాంగ్రెస్పై అసంతృప్తి వ్యక్తం చేశారు.