ఏడాదిలో భారీగా పెరిగిన బిఆర్‌ఎస్‌ ఆదాయం

ఈ ఏడాది బిఆర్ఎస్ పార్టీకి రూ. 218.11 కోట్ల ఆదాయం

BRS income increased hugely in the year

హైదరాబాద్‌ః చందాల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు ఆదాయం వస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ఇబ్బడి ముబ్బడిగా చందాలు రావడం సహజం. పలు రూపాల్లో వచ్చే ఆదాయాల లెక్కలను పార్టీలు.. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేస్తుంటాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ ఆదాయం ఒక్క ఏడాదిలోనే ఐదు రెట్లు కంటే ఎక్కువ పెరిగింది. తెలంగాణలో అధికార పార్టీ ఆదాయం గతేడాది మార్చి 31 నాటికి రూ. 37.65 కోట్లుగా ఉంది. ఒక్క ఏడాది తిరిగే సరికి రూ. 218.11 కోట్ల ఆదాయం లభించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 31నాటికి తమ ఆదాయ లెక్కలను బిఆర్ఎస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.

ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏకంగా రూ. 153 కోట్ల ఆదాయం సమకూరిందని బిఆర్ఎస్ తెలిపింది. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ. 40 కోట్లు వచ్చాయని, ఇతర ఆదాయాల రూపంలో రూ. 16 కోట్లు సకూరినట్టు తెలిపింది. ఏడాది కాలంలో రూ. 27.93 కోట్ల ఖర్చు అయినట్టు వెల్లడించింది. మొత్తంగా రూ. 190 కోట్ల నికర ఆదాయం లభించిందిన తెలిపింది. దాంతో, తమ తాజా ఆస్తుల విలువ రూ. 480.75 కోట్లకు చేరుకుందని వివరించింది. గత ఆర్థిక సంవత్సర నాటికి పార్టీ ఆస్తుల విలువ రూ. 288.24 కోట్లు ఉండగా.. ఏడాది తిరిగే సరికి దాదాపు రెట్టింపు అవడం గమనార్హం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/